*గుంటూరు కృష్ణానగర్ లో దారుణం
*యువతి, ఆమె తల్లిపై బ్లేడుతో యువకుడు దాడి
*అడ్డకున్న తల్లిపై దాడి చేసిన యువకుడు దర్మతేజ..
*దాడిలో తల్లి కూతురుకు గాయాలు ఆస్పత్రికి తరలింపు..
గుంటూరులో ఓ యువకుడు ప్రేమోన్మాదంతో దారుణానికి తెగబడ్డాడు. ఇంట్లోకి చొరబడ్డ ఉన్మాది యువతిపై బ్లేడ్ తో దాడికి తెగబడ్డాడు. అడ్డుకోడాని ప్రయత్నించిన ఆమె తల్లిపైనా దాడిచేసాడు. ఇలా ప్రేమోన్మాది తల్లీకూతుళ్లపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే..
గుంటూరులోని కృష్ణానగర్ పీఎఫ్ కార్యాలయం ఎదుట ఉన్న అపార్ట్మెంట్లో ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. బుధవారం (మే 1) యువతి ఇంట్లోకి చొరబడ్డ ఓ యువకుడు బ్లేడుతో ఆమెతో పాటు ఆమె తల్లిపై దాడి చేశాడు. ఇద్దరి గొంతు కోసే ప్రయత్నం చేశాడు. దాడి అనంతరం అపార్ట్మెంట్ రెండో అంతస్తు నుంచి దూకి తప్పించుకోబోయాడు.
ఈ క్రమంలో స్థానికులు యువకుడిని అడ్డగించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. యువకుడి దాడిలో గాయపడిన యువతి, ఆమె తల్లిని ఆసుపత్రికి తరలించారు. పారిపోయే క్రమంలో యువకుడు కూడా బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. దీంతో అతన్ని కూడా జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. నిందితుడిని తెనాలికి చెందిన ధర్మతేజగా గుర్తించారు.