telugu navyamedia
Operation Sindoor నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

సిందూరం తుపాకీ మందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

పహల్గామ్‌ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

రాజస్థాన్‌ లోని బికనీర్లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ  ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను కేవలం 22 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని తెలిపారు.

“ఏప్రిల్ 22 నాటి దాడికి ప్రతిస్పందనగా మే 7న చేపట్టిన ఆపరేషన్లో ఉగ్రవాదులకు చెందిన 9 అతిపెద్ద స్థావరాలను 22 నిమిషాల్లో ధ్వంసం చేశాం.

సిందూరం తుపాకీ మందుగా మారితే ఏం జరుగుతుందో శత్రువులకు చూపించాం” అని ప్రధాని మోదీ చెప్పారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ ప్రతీకార చర్యలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆయన పేర్కొన్నారు.

“నా నరాల్లో రక్తం కాదు, సిందూరం మరుగుతోంది” అని మోదీ ఉద్ఘాటించారు. “ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా ఉంది.

పహల్గామ్ దాడి తూటాలు 140 కోట్ల మంది భారతీయుల గుండెల్లో గుచ్చుకున్నాయి. మేం ఉగ్రవాదపు గుండెల్లోనే దెబ్బకొట్టాం. ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.

మన సాయుధ దళాలు పాకిస్థాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి” అని ప్రధాని వివరించారు.

ఈ కార్యక్రమానికి ముందు, ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన దేష్నోక్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు.

అలాగే, బికనీర్-ముంబై ఎక్స్ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపారు. అనంతరం దేష్నోక్లోని ప్రసిద్ధ కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

Related posts