తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2021 ఫలితాలను సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం విడుదల చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలు విడుదల చేశారు. ఎడ్సెట్లో 33,683 (98.53 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు చెప్పారు.
ఉత్తీర్ణులైన వారిలో 25,983 మంది అమ్మాయిలు ఉన్నట్లు వెల్లడించారు. ఎడ్సెట్లో నల్గొండ జిల్లాకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్ మొదటి ర్యాంకు సాధించారు. మంచిర్యాల విద్యార్థిని ఎ.ప్రత్యూషకు రెండో ర్యాంకు, పట్నాకు చెందిన రిషికేశ్ కుమార్ శర్మకు మూడో ర్యాంకు వచ్చినట్లు లింబాద్రి తెలిపారు.