అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజమాత శివగామీ దేవిలాగా ‘నా మాటే శాసనం’ అన్నట్లు నిర్ణయాలు తీసుకుంటూ.. అమెరికా ప్రజలతో పాటు మిగిలిన దేశాలను కూడా ఇబ్బంది పెడుతున్నాడు.
అంతటితో ఆగాడా అంటే.. ఆయన మాటలు చెప్పడంలో బిల్డప్ బాబాయ్ని మించిపోయాడు. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆపింది తానేనని గత కొంతకాలం నుంచి డప్పాలు కొట్టుకుంటూనే ఉన్నాడు.
ఇప్పుడు ఓ మెట్టు పైకి ఎక్కి.. దారుణమైన ప్రచారాలు చేయటం మొదలెట్టాడు. పాకిస్తాన్ అధ్యక్షుడిలాగా మాట్లాడుతున్నాడు.
శుక్రవారం వైట్ హౌస్లో డిన్నర్ పార్టీ జరిగింది. ఈ విందులో రిపబ్లికన్ పార్టీకి చెందిన నేతలు పాల్గొన్నారు. విందు సందర్భంగా ట్రంప్ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తెచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ‘నిజం చెప్పాలంటే.. కొన్ని విమానాలు గాల్లోనే పేలిపోయాయి. నాలుగో, ఐదో.. ఓ ఐదు ఫైటర్ జెట్లను కాల్చేశారని అనుకుంటా ’ అని అన్నారు. అయితే, ఆయన ఏ దేశం ఫైటర్ జెట్లు కూలిపోయాయో క్లారిటీగా చెప్పలేదు.
పాకిస్తాన్తో ట్రంప్ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. యుద్ధం సందర్భంగా చోటుచేసుకున్న అన్ని పరిణామాల గురించి పాక్.. ట్రంప్కు చెప్పింది.
పాక్ ఆయనకు జరిగినవి, జరగనివి కూడా చెప్పినట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. యుద్ధం సందర్భంగా ఇండియాకు చెందిన ఫైటర్ జెట్లను కూల్చేశామని, రాఫెల్ ఫైటర్ జెట్లను కూడా పేల్చేశామని, ఇండియా పైలట్లను పట్టుకున్నామని పాక్ ప్రచారం చేసుకుంటోంది.
ఈ విషయాల్ని ట్రంప్ నిజమని నమ్మినట్లు ఉన్నారు. ట్రంప్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇండియా, పాకిస్తాన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నారు. విమర్శల పాలవుతున్నారు.