telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థ పై కఠిన పర్యవేక్షణ ఉండాలి’, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్యాస్ కంపెనీల ప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని, ముఖ్యంగా పాఠశాలలు, ఆస్పత్రులు మరియు దేవాలయాలకు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఆందోళనకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించడంతో, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

కేవలం సరఫరాను నియంత్రించడమే కాకుండా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎల్‌పీజీ (LPG) వినియోగాన్ని తగ్గించే దిశగా, వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) మరియు ఇండక్షన్ స్టవ్‌ల వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

ముఖ్యంగా వాణిజ్య అవసరాల కోసం హోటళ్లు మరియు రెస్టారెంట్లు ఎల్‌పీజీపై ఆధారపడటం తగ్గించేలా వారితో ప్రత్యేకంగా చర్చలు జరపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పర్యావరణ హితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన వనరుల వైపు ప్రజలను మళ్లించడం ద్వారా గ్యాస్ కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని సీఎం భావిస్తున్నారు.

 

Related posts