తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీన జరగాల్సిన కేబినెట్ భేటీ ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు.
తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ఐదుగురిలో ముగ్గురు మంత్రులు.. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి.. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ OBC సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లినట్లు సమాచారం.
ఈ సమావేశానికి సంబంధించి వారు కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు ఢిల్లీకి వెళ్లారు. ఇతర ఇద్దరు కీలక మంత్రులు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.
పార్టీలో కీలక చర్చలు, సమావేశాల నిమిత్తం వారు అక్కడే మకాం వేసినట్లు తెలుస్తోంది. కాబట్టి, మంత్రివర్గ సమావేశం పూర్తిస్థాయి హాజరుతో నిర్వహించాలనే ఉద్దేశంతో, సీఎం రేవంత్ రెడ్డి 28వ తేదీకి మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా రైతుల సమస్యలు, వానాకాలం సాగు, విద్యుత్ సరఫరా, కొత్త పాలసీలు, భూ సర్వేలు, ఋణమాఫీ తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

