నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కలిసి రైలు పట్టాల పై పార్టీ చేసుకున్నారు. పూటుగా మద్యం తాగిన సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, ఇక్కడి ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న సిద్ధిఖ్ రాజా (22), రాజశేఖర్ (20), గౌతమ్ (23), కురుస్వామి (24), విఘ్నేశ్ లు రౌతర్ పాలం రైల్ ఓవర్ బ్రిడ్జి వద్ద పార్టీ చేసుకున్నారు.
ఆ సమయంలో చెన్నై – అల్లప్పుంజా ఎక్స్ ప్రెస్ రైలు అదే పట్టాలపై దూసుకొచ్చింది. రైలును వారెవరూ గమనించలేదు. విఘ్నేశ్ మినహా మిగతా నలుగురిపై నుంచి రైలు దూసుకెళ్లడంతో, వారంతా అక్కడికక్కడే మరణించారు. విఘ్నేశ్ కు తీవ్ర గాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలి వద్ద మద్యం బాటిల్స్, ప్లాస్టిక్ కప్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు.