నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి పాఠశాలకు 200 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 600 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
వీటితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.
ప్రజాపాలన – ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని కోరారు.
ఈ వేదికగా ఇందూరు జిల్లా మహిళా సమాఖ్య (1614 స్వయం సహాయక సంఘాలు)కు 200 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు.
“నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి మారుపేరు. ఇక్కడి వ్యవసాయం దేశానికే ఆదర్శం.
ఈ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అదనంగా నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. జిల్లా అభివృద్ధికి నూటికి నూరు శాతం ప్రయత్నిస్తా” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

