ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి తొలి భారీ విజయం దక్కింది.
పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న ‘రీన్యూ’ (ReNew) సంస్థ, రాష్ట్రంలో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఐదేళ్ల క్రితం రాష్ట్రం నుంచి నిష్క్రమించిన ఈ సంస్థ తిరిగి రానుండటం పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ కీలక విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
“ఐదేళ్ల విరామం తర్వాత ‘రీన్యూ’ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన రంగంలో సంపూర్ణ పెట్టుబడి పెట్టేందుకు రావడం గర్వంగా ఉంది.
రూ. 82,000 కోట్ల పెట్టుబడితో సోలార్ ఇంగాట్, వేఫర్ తయారీ వంటి హై టెక్నాలజీ విభాగాల నుంచి గ్రీన్ హైడ్రోజన్, అణువుల ఉత్పత్తి వరకు అన్ని దశల్లోనూ ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది” అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరవుతున్న రీన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, ఆయన బృందానికి లోకేశ్ సాదర స్వాగతం పలికారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఓ ప్రముఖ సంస్థ తిరిగి రాబోతోందని నిన్న మంత్రి లోకేశ్ చేసిన ప్రకటన వెనుక ఉన్న అసలు విషయం ఇదేనని స్పష్టమైంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇంత భారీ పెట్టుబడిని ఆకర్షించడం, రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పెట్టుబడి ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇది రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చగల కీలక పరిణామంగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.


మంత్రి పదవి దక్కలేదని తనకు బాధలేదు: రోజా