telugu navyamedia
Uncategorized

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్

Prakash

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సినీ,రాజకీయ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. దీంతో మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. అందులో భాగంగానే ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్. గురువారం షాద్‌నగర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో కుమారుడితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ… “తనికెళ్ల భరణి ఎప్పుడూ మంచి ఛాలెంజ్‌లు తీసుకొని నాకు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఎంతో ఇష్టమైన గ్రీన్ ఛాలెంజ్‌ను నాకు ఇవ్వడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరేళ్లలో హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చారు. దీనికి కారణం ఆయనకున్న పది సంవత్సరాలు విజన్. కేసీఆర్, సంతోష్‌కుమార్‌లకు మట్టితో అవినాభావ సంబంధం ఉంది. ఆ కారణంగానే మొక్కలు పెంచే బాధ్యతలో ప్రజలందరినీ భాగస్వాములు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ అంతటా పచ్చదనం పరుచుకుంది. దీనివల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి” అని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా అందరిచేత మొక్కలు నాటిస్తూ పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు ప్రకాష్‌రాజ్ తెలిపారు. ఈ ఛాలెంజ్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మలయాళ స్టార్ మోహన్ లాల్, తమిళ నటుడు సూర్య , కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

Related posts