టీడీపీ పొలిట్బ్యూరోకు గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామాను అరుణకుమారి పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. గతకొన్నిరోజులుగా టీడీపీ అధినాయకత్వం కొత్త కమిటీల నియామకం జరుపుతోంది. ఇటీవలే పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా నియమించింది. ఈ తరుణంలో అరుణకుమారి కీలక బాధ్యతల నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాతృమూర్తి అయిన గల్లా అరుణకుమారి సుధీర్ఘకాలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఆమె తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ అరంగ్రేటం చేశారు. టీడీపీ తరపున గుంటూరు నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు.