పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు కు గురువారం ఉదయం కేంద్ర మంత్రి షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు , కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్థానిక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం డొక్కా సీతమ్మ అని, ఆదికవి నన్నయలకు జన్మనిచ్చిన నేల గోదావరి తీరమని పేర్కొన్నారు.
రూ. 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డబుల్ ఇంజన్ సర్కార్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్ర మంత్రి షెకావత్ సహకారం అందించారన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కోసం షెకావత్ సహకారం అందించారని కొనియాడారు.
ఏపీలో 974 కిలోమీటర్ల నదీ తీరం ఉందని, విదేశాల్లో నదీ తీరాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసిన విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు.
2035 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రాజమండ్రి వద్ద గోదావరిపై 127 సంవత్సరాల చరిత్ర ఉన్న హేవలాక్ రైల్వే వంతెనను టూరిజం స్పాట్గా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
రాజమండ్రి రూరల్ బొమ్మూరులో 15 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సైన్స్ మ్యూజియంను కేంద్ర మంత్రి షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభోత్సవం చేస్తారు.
అలాగే దివాన్ చెరువు వద్ద రూ. 30 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేయనున్నారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ పేర్కొ న్నారు.
ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రహితంగా నిర్వహిస్తున్నామని, తాగునీటికి ప్లాస్టిక్ వాడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.
పుష్కర్ఘాట్ వద్ద గజ ఈతగాళ్లు, రెస్య్కూ బోట్లను అందుబాటులో ఉంచామన్నారు.