దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించేదుకు సిద్దమవుతున్నాయి. ఈ నెల 23న ఫలితాల అనంతరం పరిస్థితి ఏ విధంగా ఉండనుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సోనియా గాంధీ బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితాలు వెలువడిన రోజు కూటమి సమావేశం కానుంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలోనే ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబుకు మీడియా నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరాను కలిసి చంద్రగిరి రీపోలింగ్ అంశంపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ఆయనను కూటమితో టీఆర్ఎస్ కలిసి వచ్చినా పని చేస్తారా? అని ప్రశ్నించింది. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కలుస్తామని చెపుకొచ్చారు.