పాకిస్థాన్ లో కరోనా వ్యాప్తి క్రమంగా విస్తరిస్తోంది. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్ లో కరోనా బాధితుల సంఖ్య 2,238 కాగా, మరణాలు 31కి పెరిగాయి. పూర్తిస్థాయి లాక్ డౌన్ ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉంది. ప్రజలు ఆంక్షలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం రానున్నరోజుల్లో అక్కడి పరిస్థితి ఊహించని విధంగా మారొచ్చన్న అంచనాలకు బలం చేకూరుస్తోంది.
దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా మసీదులు ఇప్పటికీ మూతపడలేదు. ఇప్పటికే ఇరాన్, సౌదీ అరేబియా మసీదులను మూసివేసినా, పాక్ లో మసీదుల్లో ఇప్పటికీ ప్రార్థనలు జరుగుతున్నాయి. గత నెలలో పాకిస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి 2.50 లక్షల మంది హాజరయ్యారని తెలుస్తోంది.
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన వారి వివరాలు తెలుసుకోవడం పట్ల పాక్ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి కనబర్చుతోంది. ఇరాన్ సరిహద్దు ప్రాంంతంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాల లేమి తీవ్రంగా ఉంది. తగినంత స్థాయిలో స్క్రీనింగ్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం పాక్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.పాక్షిక లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కేసులు రెట్టింపయ్యాయి. మరికొన్నిరోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగనుందని ఆందోళనలు వినిపిస్తున్నాయి.

