కరోనా వైరస్ ను నియంత్రించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మధ్యతరగతి జీవులకు ఊరట కలిగించేలా ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేస్తూ వెసులుబాటు కల్పించారు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అన్నిరంగాల్లో వేతనాల కోత, ఉద్యోగాల్లోంచి తీసివేతలు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, గ్యాస్ అధికధరలు వంటివి వారిని ఉన్నపళాన కుంగదీస్తున్నాయన్నారు.
హౌసింగ్, వ్యక్తిగత అవసరాలు, ఆటోమొబైల్, ఇతరత్రా అంశాలపై మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేశారని, కానీ వాటిపై వడ్డీ రాయితీని ఎందుకు ప్రకటించలేదని ఓ ప్రకటనలో ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. వడ్డీ రాయితీ ప్రకటించకపోతే మీరు ఈఎంఐలు వాయిదావేసినా ప్రయోజనం లేదని ఆమె పేర్కొన్నారు.