ఇటీవలే ‘మీటూ’ ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా. క్రమంగా ఈ వివాదం ముదురుతుండటంతో చివరకు క్షమాపణలు చెప్పారు. సమాజంలోని ప్రతి అంశంలోనూ పురుషులతో సమానమని మహిళలు భావించడం వల్లే వారు లైంగిక దోపిడీకి గురవుతున్నారని, ఎప్పుడైతే ఆడవాళ్లు బయటకొచ్చారో అప్పటినుంచే `మీటూ` లాంటి ఘటనలు ఎక్కువయ్యాయంటూ ముఖేష్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ‘మీటూ’ ఉద్యమానికి బాధ్యత వహించాల్సింది మహిళలేనని, వారు పురుషులతో భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి పని చూసుకుంటే మంచిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ముఖేష్ ఖన్నా. దీంతో పలువురు మహిళలతో పాటు గాయని చిన్మయి, సీనియర్ హీరోయిన్ రాధిక లాంటి స్టార్స్ ముఖేష్ మాటలపై మండిపడ్డారు. నెటిజన్లు ముఖేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖేష్ వ్యాఖ్యలపై పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. దీంతో చివరకు ముఖేష్ ఖన్నా క్షమాపణలు చెప్పారు. మహిళలను కించపరచడం తన ఉద్దేశం కాదని, తన వ్యాఖ్యల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని ముఖేష్ ఖన్నా తెలిపారు. తాను మహిళలను గౌరవిస్తానని అన్నారు.
previous post