శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ప్రముఖ నటుడు, విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు తెలిపారు. దీనితో తాను ఆస్తులను తాకట్టు పెట్టి విద్యాసంస్థలను నడిపిస్తున్నట్లు మోహన్ బాబుతెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 2017–18, 18–19 విద్యాసంవత్సరంలో ఫీజు రియింబర్స్మెంట్ కింద సుమారు రూ.20 కోట్లను ప్రభుత్వం తమకు చెల్లించాల్సి ఉందన్నారు. రెండు విద్యాసంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు బకాయిలను చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఒక నెలకు కళాశాల నిర్వహణకు సుమారు రూ.6కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తోందని, ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోయినా సిబ్బందికి వేతనాలను సకాలంలోనే చెల్లిస్తున్నామని చెప్పారు. సుమారు 26 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యనందించడంలో ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు.