బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ఉత్తర – వాయవ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి.
సముద్రం అల్లకల్లోలంగా ఉంది. బలమైన అలలు తీరంపై విరుచుకు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులను విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ చేసింది.
కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరికను; మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.

