మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు.
మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. తాను ఓడిపోతే బాగుండేదని… ఇంట్లో కూర్చునేవాడినని చెప్పారు.
మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్షారెడ్డి, జిల్లా కలెక్టర్ తదితరులు హాజరయ్యారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బడి, గుడి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం, గంజాయిని విక్రయిస్తున్నారని మండిపడ్డారు.
దీని కారణంగా యువత పెడధోరణి పడుతున్నారని చెప్పారు. ప్రొహిబిషన్ శాఖ ప్రమోషన్ శాఖగా మారిందని విమర్శించారు.
ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాలని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర పథకాలు అనే వ్యత్యాసం చూపకుండా ప్రజలకు లబ్ధి కలిగేలా చూడాలని సూచించారు.