నేడు వైసీపీ అధినేత జగన్, తెరాస నేత కేటీఆర్ కీలక భేటీ ఉంది. ఈ భేటీ ద్వారా ఏపీ నుండి వైసీపీ ఫెడరల్ ఫ్రంట్ కోసం ముందడుగు వేస్తున్నట్టు సమాచారం. ఈ భేటీ వెనుక కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆదేశాల మేరకే నేటి భేటీ జరుగుతుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తమతో కలిసి రావాలని జగన్ను కేటీఆర్ కోరే అవకాశం ఉంది. నేడు హైదరాబాద్లో జరగనున్న ఈ చర్చల్లో కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.
అయితే ఫెడరల్ ఫ్రంట్ పై జగన్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఎన్నికల్లోపు ఫెడరల్ ఫ్రంట్కు ఓ రూపం తేవాలని భావిస్తున్న కేసీఆర్.. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో చర్చలు జరిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల నాటి నుంచి చంద్రబాబుపై ఆగ్రహం పెంచుకున్న కేసీఆర్.. జగన్కు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. కనుక ఈ భేటీ తో మరోసారి జగన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేయనున్నారు.