రిపోర్టు రాకముందే ఓ కరోనా అనుమానితుడు మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి ప్రాంతంలో జరిగింది. మహ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ (76) అనే వృద్ధుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించిన ఆసుపత్రి వర్గాలు వాటిని బెంగళూరు ల్యాబ్ కు పంపాయి. ఆ రిపోర్టులు రాకముందే సిద్ధిఖీ మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది.
కలబుర్గి ప్రాంతానికి చెందిన సిద్ధిఖీ కొన్నిరోజుల కిందటే సౌదీ అరేబియా నుంచి భారత్ వచ్చాడు. కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. అయితే, బ్లడ్ శాంపిల్స్ తాలూకు రిపోర్టులు బెంగళూరు ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. ఈలోపే సిద్ధిఖీ మృతి చెందడంతో అతడి మరణానికి కారణాలు తెలియలేదు.