జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన మద్దతు ప్రకటించింది.
జనసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ మంగళవారం రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్రావుతో భేటీ అయ్యారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
శంకర్ గౌడ్ మంగళవారం రోజున రామచందర్రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలను కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతు తెలిపారని బీజేపీ పార్టీ వెల్లడించింది.
అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా పవన్ కల్యాణ్ సైతం పాల్గొనే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏ నిర్ణయం తీసుకోనుందనే ఉత్కంఠ నెలకొంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పోలింగ్కు మరో వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్న సంగతి తెలిసిందే.


నాకు సంక్షోభాలు కొత్తకాదు..నేను పోరాటం కొనసాగిస్తా: చంద్రబాబు