రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో నిన్నటి నుంచి ర్యాపిడ్ యాంటిజెన్ కొవిడ్-19 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ టెస్టుల ద్వారా కేవలం అరగంటలోనే ఫలితం తెలుసుకోవచ్చు. ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 25 మందికి పరీక్షలు చేయనున్నారు. తొలి రోజు మూడు జిల్లాల్లో ఆరేడు వందల మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్లో 50 అర్బన్ హెల్త్ సెంటర్లు, రంగారెడ్డి జిల్లాలో 20, మేడ్చల్లో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్టీ-పీసీఆర్ విధానంలో కరోనా పరీక్షలు చేయగా, ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో తొలిసారి పాజిటివ్ ఫలితం వస్తే రెండోసారి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.

