ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఆరో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.
ప్రభుత్వ విధానాలపై స్పష్టత ఇవ్వడానికి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి, మంచి పాలన మధ్య సమతుల్యత చాలా ముఖ్యమని సీఎం పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్చువల్ మరియు ఫిజికల్ విధానాల కలయికతో పనిచేసే విధానం ప్రభుత్వంలో కొత్త వాస్తవంగా మారుతోందని చెప్పారు.
గతంలో Vision 2020 ప్రకటించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయని, అయితే ప్రస్తుతం దాని ఫలితాలు కనిపించడంతో దేశం మొత్తం 2047 లక్ష్యాల వైపు చూస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వివిధ శాఖలకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్ధారిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలను 20 నెలల్లోనే విజయవంతంగా అమలు చేశామని సీఎం వెల్లడించారు.
ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటిస్తామని, దానికి అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు.

