ప్రపంచమంతా కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో అదును చూసుకుని చైనా దుశ్చర్యలకు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. తూర్పు లడఖ్లోని గాల్వన్లోయ వద్ద భారత్-చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావిస్తూ చైనాపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి డేవిడ్ స్టిల్వెల్ విమర్శలు గుప్పించారు. భారత్-చైనా సరిహద్దుల్లో చైనా చర్యలను అమెరికా ప్రభుత్వ పాలకవర్గం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. మూడేళ్ల క్రితం డోక్లాంలోనూ చైనా ఇలాంటి కుట్రలే పన్నిందని ఆయన వ్యాఖ్యానించారు.
పొరుగుదేశాలతో చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతుండడంపై తమ దేశం ఇప్పుడే తమ వైఖరిని ప్రకటించలేదని తెలిపారు.చైనా ఆర్మీ వివాదాస్పద ప్రాంతంలో చాలా లోపలికి ప్రవేశించిందని, భారీగా సైన్యాన్ని మోహరించిందని చెప్పారు. చైనా ఇలా ఎందుకు చేసిందన్న విషయంపై స్పష్టత లేదని తెలిపారు.

