రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు అన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఆయన కర్నూలు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు చోట్ల మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడమన్నది అర్థంలేని విషయమని విమర్శించారు. పరిపాలన, న్యాయం, శాసనం ఈ మూడు కలిసి ఉంటే రాజ్యం బాగుంటుంది కానీ, మూడు ముక్కలు చేస్తే రాజ్యం ఎలా బాగుంటుంది? ‘వికేంద్రీకరణ’ అంటే కింద నుంచి పరిపాలన జరగాలని, పైస్థాయిలో ముక్కలు చేస్తే ఏముంటుందని రాఘవులు ప్రశ్నించారు.
పంచాయతీలను బలపర్చి, వాటికి నిధులు, హక్కులు, బాధ్యతలు ఇచ్చిన తర్వాత పై స్థాయి గురించి మాట్లాడాలని ప్రభుత్వానికి సూచించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి వుంటే కనుక దీనికి పాల్పడ్డ వారిని పట్టుకుని కేసులు పెట్టి శిక్షలు వేయించాలని, దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరని అన్నారు. ప్రభుత్వం ఆవిధంగా చేయకుండా రాష్ట్రాన్ని, ప్రజలను ఇబ్బంది పెడతామనడం, కోపాతాపాలతో రాష్ట్రాన్ని పణంగా పెట్టడం న్యాయం కాదని అన్నారు.

