తెలుగు సినిమా రంగంలో కృష్ణ గారిది ఓ విభిన్నమైన శైలి , ఓ అరుదైన వ్యక్తిత్వం . కృష్ణ గారు తెర మీద ఎలాంటి ధీరోదాత్త పాత్రలు ధరించారో తెర వెనుక కూడా అలాటి ధీరుడుగానే వున్నారు . అందుకే ఆయన్ని అందరు సాహసాల కృష్ణ అని అంటారు . కృష్ణను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు పరిచయం చేశారని అంటారు . ఆదుర్తి కృష్ణగారిని హీరోగా పరిచయం చేశారు . కానీ కృష్ణ గారిని మొదట తెలుగు సినిమాకు పరిచయం చేసింది కొంగర జగ్గయ్య . ఆ సినిమా పేరు “పదండి ముందుకు “ఈ సినిమాకు దర్శకుడు వి . మధుసూదన రావు గారు. ఇది జనవరి 26 ,1962లో విడుదలైంది . ఈ సినిమాకు మరో నిర్మాత తమ్మా రెడ్డి కృష్ణ మూర్తి . ,తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి. .ఇది సారధి స్టూడియోస్ వారు నిర్మించారు .

ఆ తరువాత కులగోత్రాలు , పరువు ప్రతిష్ఠ చిత్రాల్లో కృష్ణ గారు చిన్న పాత్రల్లో కనిపిస్తారు . ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్త వారితో నిర్మించిన సినిమా “తేనే మనసులు “. ఈ సినిమాలో కృష్ణ , రామ్ మోహన్, సంధ్యా రాణి , సుకన్య అనే నలుగురిని హీరో హీరోయిన్లు గా పరిచయం చేశారు . ఈ సినిమా 31 మార్చి 195లో విడుదలైంది . విశేషం ఏమిటంటే ఈ సినిమాలో నటించిన రామ్ మోహన్ హీరోగా నిలబడతాడని అనుకున్నారు. కానీ కృష్ణ గారు విజయవంతమైన హీరోగా 50 సంవత్సరాల పాటు తెలుగు సినిమా తెరవేల్పు గా వున్నారు .

కృష్ణ గారి నట ప్రస్థానం 2016 వరకు సాగింది . ఆయన నటించిన చివరి సినిమా “శ్రీ శ్రీ ” ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు . ఈ సినిమా 3 జూన్ 2016 న విడుదలైంది . కృష్ణ గారితో నాకు నాలుగు దశాబ్దాల పరిచయం వుంది . ఆయన ఎంత సూపర్ స్టార్ గా ఎదిగినా ఆయన సామాన్యంగా ఉండేవాడు . గ్లామర్ ఎప్పుడు ఒంటబట్టలేదు . హీరోగా నిర్మాతలను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవాడు కాదు . అన్ని సందర్భాల్లో సహకరించేవాడు . ఒకవేళ తన నిర్మాత సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ మరో సినిమా తీసుకొమ్మని డేట్స్ ఇచ్చేవాడు . ఏ నిర్మాత అయినా తన సినిమా పూర్తి చేసుకోలేకపోతే సహాయం చేసి విడుదల చేసేవాడు .

నిర్మాతల్లి డబ్బుకోసం పీడించిన దాఖలాలు లేవు . అలాగే హిపోక్రసి లేని ఏకైక హీరో కృష్ణ గారు . ఇక ఎన్టీఆర్ తో సమానంగా మాస్ ఫాలోయింగ్ వున్న ఏకైక నటుడు కృష్ణ. . 1989లో రాజీవ్ గాంధీ ప్రేరణతో రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడు గా పనిచేశారు . 2009 లో భారత ప్రభుత్వం “పద్మభూషణ్ ” అవార్డు ప్రదానం చేసి కృష్ణ గారిని గౌరవించింది . కృష్ణ కు ఇద్దరు కుమారులు రమేష్ బాబు , మహేష్ బాబు , ముగ్గురు కుమార్తెలు పద్మావతి , మంజుల, ఇందిరా ప్రియదర్శిని .

కృష్ణ బహుముఖాలుగా ఎదిగి ఒదిగిన నటుడు . నిర్మాతగా , నటుడుగా , దర్శకుడుగా , రాజకీయ నాయకుడుగా తన ప్రస్థానాన్ని కోన సాగించాడు . పద్మాలయ సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలను నిర్మించాడు . తెలుగు సినిమాలో ఎన్నో ప్రయోగ , ప్రయోజనాత్మక సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు .
కృష్ణకు తన ఇద్దరు అన్నదమ్ములు హనుమంత రావు , ఆదిశేషగిరి రావు అండగా నిలబడి హిందీ చిత్రాలను తీసి తమ ప్రత్యేకత చాటుకున్నారు . కృష్ణ గారు తెలుగు సినిమాకు ఇచ్చిన ఓ అరుదైన , అద్భుతమైన గిఫ్ట్ మహేష్ బాబు . కృష్ణ ఇప్పుడు 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు . వారికి నవ్యా మీడియా జన్మదిన శుభాకాంక్షలు .
– భగీరథ

