బీజేపీ ఆకర్ష్ పథకం బాగా విజయవంతం అయ్యింది. ఎన్నో రాష్ట్రాలలో బీజేపీ వైపు చూసేవారి సంఖ్య రానురాను పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడే నేత పార్టీ వీడతారో అన్న అనిశ్చితి నెలకొంది. తాజాగా, విజయవాడ నేత బోండా ఉమ కూడా టీడీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి రావడం చర్చనీయాంశం అయింది.
చంద్రబాబుతో భేటీ అయిన ఉమ పలు విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. బోండా ఉమ వ్యవహారంపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. బోండా ఉమ పార్టీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. మరోవైపు, టీడీపీ వర్గాలు కూడా ఉమ పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఆయన చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశారని తెలిపాయి.

