నటుడు షారూక్ ఖాన్కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. రోజ్వ్యాలీ స్కామ్పై విచారణలో భాగంగా రూ.70 కోట్ల విలువైన మూడు ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. అందులో షారూక్ ఖాన్కు చెందిన కోల్కతా నైట్రైడర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ (కేకేఆర్) ఉన్నట్లు ఈడీ తెలిపింది. దీంతో పాటు మల్టిపుల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెయింట్ జేవియర్స్ కాలేజ్లు కూడా జప్తు అయిన ఆస్తుల్లో ఉన్నట్లు ఈడీ పేర్కొంది. జప్తు అయిన మూడు ఆస్తుల తాలూకు ఖాతాల్లో దాదాపు 16.20 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, ఇందులో రూ.11.87 కోట్లు కేకేఆర్దేనని ఈడీ తెలిపింది.
ఐపీఎల్ క్రికెట్ టీమ్ల్లో ఒకటైన కేకేఆర్(కోల్కతా నైట్ రైడర్స్) యాజమాన్య కంపెనీలో షారూక్ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్, సినీనటి జూహీ చావ్లా భర్త జై మెహతా సీఈవో వెంకటేష్ మైసూర్లతోపాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై కేకేఆర్ టీమ్ స్పందించింది. రోజ్ వ్యాలీతో, కేకేఆర్ తీసుకున్న స్పాన్సర్షిప్ ఢీల్ సంబంధిత విషయంలో షారూక్కు గానీ, ఆయన భార్య గౌరీ ఖాన్కు గానీ ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు.