మావోయిస్టు ఉద్యమానికి పెను విఘాతం తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.
మరో కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ రావు (అభయ్) లొంగిపోయిన 24 గంటల్లోపే ఈ పరిణామం చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అభయ్ లొంగిపోగా, అదే రోజు ఛత్తీస్గఢ్లోని వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 78 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు.
సుక్మా జిల్లాలో 27 మంది, కాంకేర్ జిల్లాలో 50 మంది అజ్ఞాతం వీడారు. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నేతలు రాజమన్ మండావి, రాజు సలామ్ కూడా ఉన్నారు.
కాంకేర్లో లొంగిపోయిన వారు ఏకే 47 రైఫిల్స్తో సహా 17 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన ఆశన్న, 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనేక కీలక దాడుల్లో ఆయనకు ప్రమేయం ఉంది.
1999లో హైదరాబాద్లో ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య, 2000లో ఘట్కేసర్ వద్ద మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసుల్లో ఆయన నిందితుడు.
2003లో తిరుపతి అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన క్లెమోర్ మైన్స్ దాడికి నాయకత్వం వహించింది కూడా ఆశన్న బృందమే.
దేశంలో నక్సలిజానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ విజయం లభించింది.
ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కేవలం రెండు రోజుల వ్యవధిలో 258 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఈ కీలక పరిణామంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా ప్రకటన చేశారు.
హింసా మార్గాన్ని వీడి, భారత రాజ్యాంగంపై విశ్వాసం ప్రకటిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.
రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు: దేవినేని