విశాఖలో భూదందా కోసమేజగన్ రాజధాని మారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. ఈ రోజు ఓ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజలపై సీఎం జగన్ కు ఎటువంటి ప్రేమాభిమానాలు లేవని చెప్పారు. భూదందా కోసమే బి.ఎన్.రావు కమిటీ వేశారని, ఆ కమిటీ చెప్పింది ఒకటైతే జగన్ చెబుతున్నది మరొకటని విమర్శించారు.
విపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జైకొట్టి అధికారంలోకి రాగానే మాట మార్చారని ధ్వజమెత్తారు. జగన్ది నియంతృత్వ ధోరణి అని, ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. అమరావతిలో నేల గట్టిదనం లేదని చెప్పడం హాస్యాస్పదమని, ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమరావతి పరిరక్షణ కోసం త్వరలోనే జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.