ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీలు విధులు నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 26వ తేదీ వరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను కూడా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లో కోరింది.
ఈ క్రమంలో జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు..ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
ఓఎస్డీ హోదాలో కొత్త జిల్లాలకు ప్రస్తుత కలెక్టర్లు, ఎస్పీలే ఉంటారని సీఎం తెలిపారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారని సీఎం వెల్లడించారు.
కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత యంత్రాంగమంతా సమర్థంగా పనిచేయాలి. ఎలాంటి అయోమయం లేకుండా పాలన సాఫీగా జరగాలి. భవనాలు, మౌలిక వసతులు, ఉద్యోగుల విభజన.. అన్నీ పూర్తి కావాలి. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలన్నారు. అలాగే కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళికలు ఖరారు చేయాలి. భవనాల స్థలాల గుర్తింపుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి. నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడటం అన్నది చాలా ముఖ్యం. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలి. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం అన్నారు.
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

