ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ అసాధారణ రికార్డు నెలకొల్పింది.
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను నేపాల్ వైపు నుంచి అధిరోహించిన తొలి భారత పిన్నవయస్కురాలిగా నిలిచింది.
అలాగే ప్రపంచం మొత్తంమీద ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా ఖ్యాతిగాంచింది.
భారత నౌకాదళంలో పనిచేసే తన తండ్రి ఎస్. కార్తికేయన్ తో కలసి కామ్యా ఈ నెల 20న 8849 మీటర్ల ఎత్తయిన ఎవరెస్ట్ ను అధిరోహించింది.
ఈ విషయాన్ని భారత నౌకాదళానికి చెందిన వెస్టర్న్ నేవల్ కమాండ్ ‘ఎక్స్’ వేదికగా తెలియజేసింది.
‘కామ్యా అసాధారణ ప్రతిభ ప్రదర్శించింది. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన పర్వత శిఖరాలకుగాను ఆరింటిని అధిరోహించింది.
అంటార్కిటికా ఖండంలోని మౌంట్ విన్సన్ మాస్సిఫ్ పర్వత శిఖరాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో అధిరోహించాలని భావిస్తోంది.
తద్వారా ‘ఏడు ఖండాల్లో ఏడు శిఖరాల సవాల్’ను పూర్తి చేసిన అతిపిన్న వయస్కురాలిగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆమె ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాం’ అని ఇండియన్ నేవీ పోస్ట్ పెట్టింది.