telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చక్రతీర్థస్నానం … సర్వపాపహరణం..

chakratirdha snanam clear all sins

పూర్వకాలంలో 88 వేలమంది ఋషులు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి, వారు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన స్థలం ఏదో తెలపమని అడిగితే, అప్పుడు బ్రహ్మ తన మనోబలంతో ఒక చక్రాన్ని తయారుచేసి, ఆ చక్రాన్ని వదిలి, ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అదే అనుకూలమైన స్థలం అని చెప్పాడు. అలా ఆ చక్రం తిరుగుతూ, తిరుగుతూ ఉండగా దానినే అనుసరిస్తూ ఋషులంతా వెళ్ళారు. ఆ చక్రం 14 లోకాలు తిరుగి ఎక్కడా ఆగకుండా నైమిశారణ్యంలోకి వచ్చింది. ఈ స్థలం భూమికి మధ్యభాగం అని, ఋషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన ప్రాంతమని, సత్కర్మయజ్ఞయాగాలు ఇక్కడ చేసుకోవచ్చు అని బ్రహ్మ చెప్పాడు. కాని ఆ చక్రం భూమిని తవ్వుకుంటూ పాతాళమునకు వెళ్ళిపోతూ ఉంటే ఋషులు భయపడటం చూసి, బ్రహ్మ ఆదిపరాశక్తిని ప్రార్థించాడు. బ్రహ్మ యొక్క ప్రార్థనను విన్న లలితాదేవి ఆ చక్రాన్ని ఆపింది. అప్పటినుండి ఈ స్థలం నైమిశారణ్యమై లలితాదేవి ఇక్కడ ప్రత్యక్షమై ఋషుల కోరిక ప్రకారం ఇక్కడ జరిగే హోమ, యజ్ఞ, యాగములను జయప్రదం చేస్తూ, వారి జీవితాల్లో నిరాశ లేకుండా అన్నీ సఫలం అయ్యేటట్టు చేస్తోంది. బ్రహ్మ తన హృదయం నుండి సృష్టించిన మనోమయ చక్రం నేమి అంటే ‘అంచు చీలిన ప్రదేశం’ అగుటచే ఇది నైమిశారణ్యంగా పిలువబడుతోంది.

చక్రతీర్థంలో స్నానం చేసిన వారికి కష్టములు తొలగిపోయి ముక్తిని పొందుతారు. చక్రతీర్థంలో స్నానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతమే నైమిశారణ్యంగా పిలవబడుతుంది. నైమిశారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించినట్లు చెబుతారు. మహాభారతంతో పాటు రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్యం ప్రస్తావన ఉంది. నైమిశారణ్యం వైష్ణవ దివ్య ప్రదేశాల్లో ఒకటి.

Related posts