ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆయా శాఖల అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే ఈ రోజు ఉదయం స్థానిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, పెండెం దొరబాబును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.