కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు కరోనాను కట్టడి చేయకుండా తప్పుడు విధానాలతో వెళ్తున్నాయని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సరైన చర్యలను అమలు చేయట్లేదని అందుకే కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాగైతే కరోనా మరింత భీకరంగా మారే ప్రమాదముందని తెలిపింది.
ఆయా దేశాల అధినేతల నుంచి వస్తున్న మిశ్రమ సందేశాలు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయని చెప్పారు. ప్రజలకు కరోనా నంబర్ వన్ శత్రువుగానే ఉందన్నారు. అయితే, దాన్ని ఎదుర్కోవడంలో ప్రజల చర్యలు ఆ స్థాయిలో లేవని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులను ధరించడం లాంటి అంశాలను ప్రజలు, ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకోకపోతే సమీప భవిష్యత్తులోనూ సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని హెచ్చరించారు.