విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఈరోజు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని బ్లాస్ట్ ఫర్నెస్-3లోని బ్లోపైప్ ఒత్తిడి కారణంగా పేలిపోయింది. దీంతో భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సమీపంలో పార్క్ చేసిన ఐదు బైక్ లు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, భారీగా నష్టం సంభవించిందని ప్లాంట్ అధికారులు పేర్కొన్నారు. బ్లోపైప్ పేలిపోవడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందనీ తెలిపారు. పేలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టామని, పనులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకొంటున్నామని పేర్కొన్నారు.