లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పైలట్లకు కూడా ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఎలాంటి జీతాలు చెల్లించేది లేదని స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. లాక్డౌన్ సమయంలో అనుమతించిన కార్గో విమానాలు నడిపిస్తున్న పైలట్లకు మాత్రమే ఈ జీతాలు ఇస్తామని చెప్పింది. అది కూడా విమానాలు నడిపిన గంటలకు లెక్కగట్టి చెల్లింపులు ఉంటాయని తెలిపింది.
ఈ మేరకు సంస్థ విమాన ఆపరేషన్ల అధిపతి కెప్టెన్ గుర్ చరణ్ అరోరా పైలట్లకు లేఖ రాశారు. విమాన ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు సడలించిన వెంటనే సర్వీసులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. భారత విమానయాన సంస్థల్లో అత్యంత చౌకగా సేవలు అందించే స్పైస్జెట్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. మరోవైపు తమ సంస్థలో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల పూర్తి జీతం ఇస్తామని ఇండిగో గత వారమే ప్రకటించింది.