ఇటీవలే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమాను ప్రారంభించిన నాగశౌర్య ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మరో సినిమాను మొదలుపెట్టారు. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. మహేష్ ఎస్. కోనేరు నిర్మాత. కె.పి.రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శుక్రవారం రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలు జరిపి లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా హీరో కళ్యాణ్ రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్ను దర్శకుడు కె.పి.రాజేంద్రకి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మహేష్ ఎస్. కోనేరు, దర్శకుడు కె.పి.రాజేంద్ర మాట్లాడారు.
నిర్మాత మహేష్ ఎస్. కోనేరు మాట్లాడుతూ.. ‘‘నాగశౌర్య కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్గా ఉండబోతుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మా దర్శకుడు రాజా మంచి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ని రెడీ చేశారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చెప్పారు. దర్శకుడు కె.పి.రాజేంద్ర మాట్లాడుతూ.. ప్రారంభోత్సవానికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ గారికి, దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో సరికొత్త నాగశౌర్యని చూస్తారు. మార్చిలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు.