హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మలయాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా `నిశ్శబ్దం` టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా “నిశ్శబ్ధం” సినిమాను జనవరి 31, 2020 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే, విడుదల తేదీ మారుతున్నట్టు తాజాగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, విడుదల తేదీ మార్పునకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. 31వ తేదీన ‘అశ్వథ్థామ’ విడుదలవుతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ తరవాత ఫిబ్రవరి 7న సమంత, శర్వానంద్ ‘జాను’.. అనంతరం ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం క్రేజీ మూవీస్. బహుశా వీటితో పాటు విడుదల చేస్తే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఫిబ్రవరి 20కి ‘నిశ్శబ్దం’ విడుదలను వాయిదా వేసి ఉండొచ్చు అని టాక్.
previous post