తెలంగాణలో పోలీసులు కేవలం అధికార పార్టీ నేతల సేవల్లో తరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న దారుణ ఘటనలు ప్రభుత్వ వైఫల్యం, పోలీస్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని విమర్శించారు. దిశ కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగానే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదన్నారు.
రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలకు చెందిన మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటనతోపాటు అన్ని కేసులపై సిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. దిశ కేసుపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలన్నారు. ఇలాంటి ఘటనలపై సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.