ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కార్తికేయ. తాజాగా కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాణంలో “90ఎం.ఎల్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నేహా సోలంకి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, రవి కిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఇంత వరకు ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదు. ఇప్పటికే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని ఆడియో, వీడియో కట్స్ సూచించారు. అయితే చిత్రయూనిట్ సెన్సార్ టీం చూపించిన అన్ని కట్స్కు సుముఖంగా లేదని అందుకే సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. రిలీజ్కు మరో 24 గంటలు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ఈ ఒక్క రోజులో ఎలా స్పందిస్తుందో చూడాలి.

