టీడీపీ హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి కూడా ఆ పార్టీ నాయకులు లంచాలు వసూలు చేశారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి 49వ డివిజన్ లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో వెల్లంపల్లి మాట్లాడుతూ ఆర్ అండ్ బి స్థలంలో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలోని పింఛన్ల పంపిణీ, రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
టీడీపీ హయాంలో మాజీ కార్పొరేటర్ ఆలు జయలక్ష్మి పేదలకు నివాస గృహాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశారని స్థానికులు ఆరోపిస్తూ మంత్రికి ఫిర్యాదు చేశారు. పేదల పట్ల టీడీపీ నాయకులకు ఉన్న చిత్తశుద్ధి ఇది! అంటూ మనత్రి ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలపై పోలీస్ అధికారులతో మాట్లాడి, బాధితులకు న్యాయం చేస్తానని పేర్కొన్నారు.