హైదరాబాద్ శివారు సరూర్నగర్ గ్రౌండ్స్లో జరుగుతున్న సకలజనుల సమరభేరికి జనం పోటెత్తారు. ఈ సభకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. స్టేడియం వద్ద సిగ్నల్స్ ఆపేశారని, 3జి, 4జి లైవ్లు పనిచేయడం లేదని అన్నారు. టీవీల్లోనూ లైవ్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సకల జనుల సమరభేరి సభకు వస్తున్న వారిని అడ్డుకుంటున్నారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు.
.తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో తాము కూడా పాల్గొన్నామని గుర్తు చేశారు. రామాయణంలో రాముడికి ఉడుత దారి చూపించకుంటే రామాయణమే లేదని, తాము కూడా ఉడుత లాంటి వాళ్లమేనని పేర్కొన్నారు. కేసీఆర్ తమను బెదిరించారని, భయపెట్టారని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఆపినా అధైర్యపడలేదన్నారని వివరించారు.