దేశంలో మహిళలతో సహా ఎవరికీ రక్షణ ఉన్నట్టు కనిపించడంలేదు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఇటీవల పెరిగిపోతున్న బహిరంగ హత్యలు కళ్లకుకట్టినట్టు చూపిస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లో వరుసగా ఎన్నో బహిరంగ హత్యలు చోటుచేసుకోగా, తాజాగా ఆ బాటలోనే బెంగళూరులో దారుణ హత్య జరిగింది. మహదేవపురలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో ముగ్గురు దుండగులు కదాబిసినహళ్లికి చెందిన రౌడీషీటర్ మంజునాథ్ను వేటకత్తులతో నరికి చంపారు. స్నేహితురాలితో మహదేవపుర మీదగా వెళుతున్నాడు మంజునాథ్. అతడిని వెంబడిస్తూ ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. ఓ సిగ్నల్ వద్ద ఆగగానే మంజునాథ్పై దాడి చేశారు. మంజునాథ్ తప్పించుకుని పారిపోగా వెంటాడి షాపింగ్ మాల్ సమీపంలో పట్టుకున్నారు. అక్కడే వేట కత్తులతో విచక్షణా రహితంగా తలపై నరికారు.
దానితో గుర్తుపట్టడానికి వీలులేకుండా మంజునాథ్ ముఖం పూర్తిగా ఛిద్రమయింది. అతడు మరణించాడని నిర్ధరించుకున్న దుండగులు వారు వచ్చిన స్కూటీపైనే అక్కడి నుంచి పారిపోయారు. ఈ భయానక దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటి ఆధారంగానే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. చనిపోయిన వ్యక్తికి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకే దేశం ఒకే రాజ్యాంగం.. ముఖర్జీ కల నెరవేరింది: ఎంపీ సంజయ్