2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి తీవ్ర పరాజయం ఎదురైంది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తారనే వార్తలు విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు చాలా సమయం ఉండటంతో పవన్ కళ్యాణ్ తప్పకుండా సినిమా ఫీల్డ్లోకి రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తాను ఇక సినిమాలకు దూరమని తేల్చి చెప్పేశారు. అయినప్పటికీ పవర్స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ గురించి టాలీవుడ్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పవన్ సినిమా గురించి ప్రకటన వస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే పవన్ ఏ సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల `వాల్మీకి`తో విజయాన్ని అందుకున్న దర్శకుడు హరీష్ శంకర్.. పవన్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్తో సినిమా చేయాలనుకుంటున్నానని ఇటీవల ఆయనే ప్రకటించారు. ఇక, దర్శకుడు క్రిష్ కూడా పవన్ కోసం మంచి కథ రెడీ చేశారట. ఇటీవల విజయవాడ వెళ్లి పవన్కు కథ వినిపించారట. ఆ కథ ఓకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఏఎమ్ రత్నం నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాగే హిందీలోనూ, తమిళంలోనూ హిట్ అయిన `పింక్` రీమేక్ పవన్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో పవన్ ఈ సినిమా చేయడానికి అంగీకరించారట. మరి ఈ మూడు సినిమాలలో ముందుగా ఏది పట్టాలెక్కుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
previous post