ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విజయవాడకి చేరుకున్న చిరంజీవి, ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్, భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా జగన్ చిరంజీవి ఏం చర్చించారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ కొనసాగింది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు షాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు. గంట పాటు చిరంజీవి, జగన్ బేటీ జరిగింది. భేటీ ముగిసిన తరువాత చిరంజీవి తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే అక్టోబర్ 2వ తేదీన విడుదలైన చిరంజీవి ‘సైరా’ నరసింహారెడ్డి సినిమా గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లంచ్ చేసే సమయంలో సైరా సినిమా గురించి సీఎం జగన్కు తెలియని విషయాల గురించి చిరు చర్చించినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ సైరా సినిమాను చూసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సైరా సినిమా చూసేందుకు జగన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. విజయవాడలో పీవీపీ మాల్ లో జగన్ సినిమా చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు చిరంజీవి సీఎం జగన్ ను వినోదపు పన్ను మినహాయింపు గురించి కూడా కోరినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ వినోదపు పన్ను విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈనెల 5న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.
Megastar Chiranjeevi Meets Andhra Pradesh Chief Minister YS JaganMohanReddy pic.twitter.com/A9rmlz3Ip7
— BARaju (@baraju_SuperHit) 14 October 2019