ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తండ్రి మరణ వార్త తెలియడంతో విదేశీ పర్యటనలో ఉన్న కోడెల తనయుడు శివరామ్ కొద్ది సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. శివరాంని తీసుకుని కుటుంబ సభ్యులు గుంటూరుకు బయల్దేరి వెళ్లారు. కెన్యా నుంచి తెల్లవారుజామున ముంబైకి.. అక్కడి నుంచి గన్నవరానికి కోడెల శివరాం చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయన్ని ఓదార్చారు.
అక్కడి నుంచి నరసరావుపేటకు శివరామ్ బయలుదేరారు. ఈ సందర్భంగా శివరామ్ ను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ మా కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ పరిస్థితుల్లో నేనేమీ మాట్లాడలేనన్నారు. ఇదిలా ఉంటే కోడెల భౌతికకాయాన్ని గుంటూరుకు తరలించారు. గుంటూరులోని పార్టీ ఆఫీస్లో అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత కోడెల భౌతికకాయాన్ని నరసరావుపేటకు తరలించనున్నట్లు తెలిసింది.