ఏపీ సీఎం జగన్ జలవనరుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వరద వచ్చినప్పుడే ఒడిసిపట్టాలని సూచించారు. సముద్రంలోకి వరదనీరు వెళ్లకముందే కృష్ణా వరద జలాలపై ఆధారాపడ్డ ప్రాజెక్టులు నిండాలని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అతితక్కువ సమయంలో భారీగా వరద వచ్చిందని అన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండి వరద జలాలు సముద్రంలోకి వెళ్లాయని అన్నారు. దేవుడి దయ వల్ల రెండోసారి వరద వచ్చిందని వ్యాఖ్యానించారు. 120 రోజుల వరద వస్తుందనే లెక్కలను సవరించాలని సూచించారు. ఈ సీజన్ లో వరద వచ్చినా ప్రాజెక్టులను నింపడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. ముప్పై రోజులు మాత్రమే వరద వస్తుందని అంచనా వేసి ఆ మేరకు నీటిని తరలించడానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.