పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమ్మె చేస్తున్న వైద్యులపై ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు తక్షణం ఆమె వైద్యశాఖా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి హిట్లర్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ, సీపీఎంలు మండిపడుతున్నారు. గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న వైద్యులు వెంటనే విరమించి విధుల్లో చేరాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని మమత ఆదేశాలు జారీ చేశారు.
సీఎం ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోని వైద్యులు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.వైద్యులపై సానుభూతి ప్రకటించాల్సింది పోయి బెదిరించడం ఏమిటని మమతపై ప్రతిపక్షాలు దాడి మొదలుపెట్టాయి. అధికార బలంతో హిట్లర్లా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం గా , వైద్య మంత్రిగా ఆమె విఫలమయ్యారని అన్నారు. వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.